Chandrababu Naidu: 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను సద్వినియోగం చేసుకుంటాం: సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతి కేంద్రంగా దేశంలోనే క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృహత్ ప్రణాళికను ప్రకటించారు. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలను తొలిగా అందిపుచ్చుకుని 'అమరావతి క్వాంటం వ్యాలీ' (ఏక్యూవీ) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం అమరావతిలో జరిగిన 'క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టం' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా అమరావతిని ప్రపంచపటంలో నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

గతంలో ఐటీ రంగాన్ని అందిపుచ్చుకున్న తరహాలోనే, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీలోనూ 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను సద్వినియోగం చేసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. "గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి ఐటీ నిపుణులను తయారు చేశాం. ఆ విజన్ ఇప్పుడు ఫలితాలనిస్తోంది. అదే విధంగా ఐటీతో పాటు ఫార్మా రంగంలో జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసి విజయం సాధించాం. కరోనా సమయంలో ఇక్కడి వ్యాక్సిన్లు 100 దేశాలకు సరఫరా అయ్యాయి" అని ఆయన గుర్తుచేశారు. ఈ అనుభవంతోనే క్వాంటం టెక్నాలజీలోనూ ముందడుగు వేస్తున్నామన్నారు.

అమరావతిలో క్వాంటం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు 8 టవర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల సహకారంతో ఏపీలో తొలి క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం దిగుమతులపై ఆధారపడకుండా, రెండేళ్ల వ్యవధిలోనే దేశీయంగా క్వాంటం కంప్యూటర్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. దీనికి అవసరమైన పరికరాలు, క్రయోజనిక్స్, అల్గారిథమ్స్ వంటివన్నీ ఇక్కడే అభివృద్ధి చేసుకుంటామన్నారు.

క్వాంటం వ్యాలీకి అవసరమైన గ్రీన్, క్లీన్ ఎనర్జీని అందిస్తామని, మైక్రో గ్రిడ్స్ ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తామని తెలిపారు. దీంతో పాటు స్పేస్ టెక్నాలజీ, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 'సంజీవని' ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు, 'ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్' వంటి సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు.

"క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీతో అమరావతి భవిష్యత్ నగరంగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా మారుతుంది. అమరావతి ఇక అన్‌స్టాపబుల్. అమెరికన్ సిలికాన్ వ్యాలీతో పోలిస్తే క్వాంటం వ్యాలీ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఏపీ భవిష్యత్తు మాత్రమే కాదు, దేశ ప్రగతికి చోదక శక్తిగా నిలుస్తుంది" అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Amaravati Quantum Valley
Quantum Computing Technology
Andhra Pradesh
AP Quantum Computer
Quantum Mission
IT Sector
Genome Valley
First Mover Advantage

More Telugu News