Hyderabad: క్షణికావేశంలో దారుణ నిర్ణయం... ఇద్దరు పిల్ల‌ల‌ ప్రాణం తీసిన తల్లి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న మనస్తాపంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో వెలుగుచూసింది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
స్థానికంగా స్రవంతి (28) అనే మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. వీరికి కార్తిక్ (12), కౌశిక్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కొంతకాలంగా ఆమె భర్త వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం తెలిసి స్రవంతి తీవ్ర మ‌నోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తితో దారుణమైన నిర్ణయం తీసుకుంది. ముందుగా తన ఇద్దరు కుమారులను చంపి, అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్త వివాహేతర సంబంధమే ఈ దారుణానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కన్నతల్లే పిల్లలను కడతేర్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Hyderabad
Kukatpally
Extra marital affair
Suicide
Children murder
Raghavendra Colony
Telangana
Crime news
Family tragedy

More Telugu News