Masood Azhar: పాక్‌లో మసూద్ అజర్ సోదరుడు అనుమానాస్పద మృతి.. జైషేకు గట్టి ఎదురుదెబ్బ!

Masood Azhars Brother Mohammad Tahir Anwar Dies in Pakistan
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థకు పాకిస్థాన్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజర్ సోదరుడు, కీలక నేత అయిన మొహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని మరణానికి గల కారణాలపై స్పష్టత లేకపోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

తాహిర్ అన్వర్ మరణించిన విషయాన్ని జైషే మహమ్మద్ తన అధికారిక ఛానెల్ ద్వారా ధృవీకరించింది. సోమవారం రాత్రి పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో గల ‘జామియా మసీదు ఉస్మాన్ వలీ’లో అతని అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించింది. అయితే, అతడికి అనారోగ్యం ఉన్నట్లుగా గానీ, ప్రమాదానికి గురైనట్లు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ హఠాత్ పరిణామం వెనుక అంతర్గత కలహాలు లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

తాహిర్ అన్వర్ కేవలం మసూద్ అజర్ సోదరుడు మాత్రమే కాదు, జైషే సంస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి. సంస్థకు అవసరమైన లాజిస్టిక్స్ (వస్తు సామాగ్రి సరఫరా), సంస్థాగత వ్యవహారాలను అతనే పర్యవేక్షించేవాడని తెలుస్తోంది. బహవల్పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయంలో అతడిదే కీలకపాత్ర అని సమాచారం. అతని మరణం సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2001లో భారత పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్, ఉరీ దాడులు, 2019లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడి వంటి అనేక భీకర దాడుల వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉంది. గతంలో భారత భద్రతా బలగాలు బహవల్పూర్‌లోని జైషే స్థావరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో మసూద్ అజర్ బంధువులు కొందరు మరణించినట్లు కూడా సమాచారం. తాహిర్ అన్వర్ మరణంపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఈ పరిణామం జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Go Back to Shorts
Masood Azhar
Mohammad Tahir Anwar
Jaish-e-Mohammed
Pakistan
Bahawalpur
Terrorist attack
Pulwama attack
Pathankot attack
Uri attack
India

More Telugu News