Donald Trump: ఇరాన్‌తో యుద్ధం త్వరగా ముగింపు దిశగా ట్రంప్ అడుగులు?

ఇరాన్‌తో గత ఐదు వారాలుగా కొనసాగుతున్న 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'కి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే, యుద్ధాన్ని ముగించాలని చెబుతూనే, మరోవైపు ఆ ప్రాంతంలో సైనిక మోహరింపును పెంచడం గందరగోళానికి తావిస్తోంది.

WSJ కథనం ప్రకారం, ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించడం కంటే ఇరాన్ నౌకాదళాన్ని, క్షిపణి వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా  ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సైనిక చర్య తర్వాత దౌత్యపరమైన ఒత్తిడితో జలసంధిని తెరిపించాలని, అది విఫలమైతే ఆ బాధ్యతను యూరప్, గల్ఫ్ మిత్రదేశాలకు అప్పగించాలని అమెరికా యోచిస్తోంది.

యుద్ధాన్ని త్వరగా ముగించాలని ట్రంప్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత వారాంతంలోనే యూఎస్ఎస్ ట్రిపోలి యుద్ధనౌకతో పాటు 2,500 మంది మెరైన్లను అమెరికా మోహరించింది. అదనంగా మరో 10,000 మంది సైనికులను పంపేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా, ఇరాన్ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునే క్లిష్టమైన ఆపరేషన్‌ను కూడా ట్రంప్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఈ పరిణామాలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ, హర్మూజ్ జలసంధిని తెరిపించడం అనేది యుద్ధాన్ని ముగించడానికి తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి కాదని స్పష్టం చేశారు. అయితే, అమెరికా సైనిక చర్య ముగిశాక జలసంధి ఏదో ఒక రూపంలో తెరుచుకుంటుందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రతిష్టంభన ఎప్పుడు ముగుస్తుందనే దానిపై అనిశ్చితి కొనసాగుతోంది.
Donald Trump
Iran
US Iran conflict
Hormuz Strait
Operation Epic Fury
Middle East tensions
US military
Marco Rubio
oil prices

More Telugu News