Rahul Gandhi: ఎల్డీఎఫ్-బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది: కేరళలో రాహుల్ గాంధీ విమర్శలు
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ విమర్శల పదును పెంచారు. రాష్ట్రంలో అధికార ఎల్డీఎఫ్ (వామపక్ష కూటమి) - కేంద్రంలోని బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పత్తనంతిట్ట జిల్లా అడూర్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ... కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేవలం వామపక్షాలతోనే కాకుండా, 'ఎల్డీఎఫ్-బీజేపీ' కూటమితో కూడా పోరాడుతోందని అన్నారు.
పాలక్కాడ్ పర్యటనలో ప్రధాని మోదీ శబరిమల ఆలయ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాహుల్ ప్రశ్నించారు. ఆలయ బంగారాన్ని కాజేశారన్న ఆరోపణలపై ప్రధాని మౌనం వహించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్నారు. కేవలం ఓట్ల కోసమే మోదీకి గుడులు, మతం గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం తన వంటి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, 36 కేసులు పెట్టి 55 గంటల పాటు విచారించాయని రాహుల్ గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పినరయి విజయన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. విజయన్ అవినీతి మరకల వల్లే మోదీ గుప్పిట్లో ఉన్నారని, అందుకే వామపక్ష ప్రభుత్వం 'కార్పొరేట్ నిధుల ప్రభుత్వం'గా మారిందని విమర్శించారు.