Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 3 పిటిషన్ల కొట్టివేత.. చంద్రబాబుకు ఊరట!
ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఈ పిటిషన్లకు చట్టబద్ధంగా విచారణార్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర నిందితులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును రాష్ట్ర ఏజెన్సీల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలంటూ ఒక పిటిషన్... ఇదే కేసులో చంద్రబాబుకు గతంలో మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్... ఏసీబీ కోర్టులో ఉన్న ఈ కేసు విచారణను ఎంపీలు-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మూడో పిటిషన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాజకీయ కారణాలతో లేదా ఇతర ఉద్దేశాలతో వేసిన పిటిషన్లుగా వీటిని పరిగణించింది. ఈ పిటిషన్లను కొనసాగించాల్సిన అవసరం లేదని, వీటికి చట్టపరమైన విచారణార్హత లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.