Shanti Kothari: విమానం ఎక్కనివ్వలేదని ఆగ్రహం.. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ అరిచిన వ్యక్తి అరెస్ట్

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ బాంబు బెదిరింపుతో కలకలం సృష్టించిన 58 ఏళ్ల ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విమానంలో బాంబు ఉందంటూ గట్టిగా అరుస్తూ గందరగోళానికి కారణమైన అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, శాంతి కొఠారి అనే వ్యక్తి ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అతను, ముంబై నుంచి ఘజియాబాద్ వెళ్లే విమానంలో బాంబు ఉందని, ఆ ఫ్లైట్ ఎక్కవద్దని గట్టిగా అరవడం ప్రారంభించాడు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానయాన సంస్థ సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న సహార్ పోలీసులు శాంతి కొఠారిని అరెస్ట్ చేశారు. విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 125, 351(2), 353(1)(b) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడి నేపథ్యంపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, దేశవ్యాప్తంగా ఇటీవల ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపుల ఘటనలు ఎక్కువయ్యాయి. కొద్ది రోజుల క్రితం గుజరాత్ శాసనసభ, హైకోర్టుతో పాటు పలు కోర్టులకు, అలాగే ఢిల్లీలోని పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపు ఇ-మెయిల్స్ రావడం, తర్వాత అవి నకిలీవని తేలడం తెలిసిందే.
Shanti Kothari
Mumbai Airport
Bomb threat
Fake bomb threat
Flight arrest
Ghaziabad flight
CISF
Mumbai to Delhi flight
Airport security
Immigration officials

More Telugu News