Manoj Rajak: స్నేహితులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. ఇన్‌స్టా లైవ్‌లోనే యువకుడి ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివపురి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో లైవ్‌లో మాట్లాడుతూనే ఉన్నట్టుండి ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

మనోజ్ రజక్ తన అద్దె గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు ముందు అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించాడు. ఈ సమయంలో తన స్నేహితులకు అభివాదం చేస్తూ, ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ కనిపించాడు. ఆ తర్వాత హఠాత్తుగా ఉరితాడుకు వేలాడాడు. ఈ దృశ్యమంతా 14 నిమిషాల వీడియోలో రికార్డయింది.

మనోజ్ తల్లి గతంలోనే మరణించగా, తండ్రి మరో వివాహం చేసుకున్నారు. దీంతో అతడు ఒంటరిగా అద్దె గదిలో నివసిస్తున్నాడు. ప్లంబర్‌గా పనిచేస్తూనే, రెడీమేడ్ దుస్తులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడని స్నేహితులు తెలిపారు. ఇన్‌స్టా లైవ్‌లో అతడు ఉరేసుకోవడం చూసి రాత్రి 10:30 గంటలకు గదికి చేరుకున్నామని, కానీ అప్పటికే మనోజ్ మృతి చెందాడని స్నేహితుడు మీడియాకు వివరించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మనోజ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అతని సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Manoj Rajak
Shivpuri
Instagram live suicide
Madhya Pradesh suicide
Youth suicide
Online suicide
Suicide video
Dehat police station
Social media suicide
India suicide

More Telugu News