Chandrababu Naidu: అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ... ఎవరూ టచ్ చేయలేరు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says Amaravati is Andhra Pradesh Soul Untouchable
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని... అది అమరావతేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అజేయం, అద్భుతం, అజరామరమని అభివర్ణించారు. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని పునరుద్ఘాటించారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ అని, రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అభివర్ణించారు.

అమరావతికి చట్టబద్ధత 
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5(2)ను సవరించాలని ఈ తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరారు. చట్టంలో రాజధానిని పేర్కొనేచోట ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చేర్చాలని ప్రతిపాదించారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలన్నిటికీ రాజధాని పరిధి వర్తింపజేసేలా చట్ట సవరణ చేయాలని కోరారు. 

శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్ర హోంమంత్రికి పంపించారు. ఈ తీర్మానం ప్రతుల్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపడం ద్వారా అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు.

రైతుల త్యాగం.. జగన్‌పై విమర్శలు 
రాష్ట్ర భవిష్యత్తు కోసం 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో భావోద్వేగంగా ప్రసంగించారు. రైతులు ఇచ్చింది కేవలం భూమి కాదని, రాష్ట్ర భవిష్యత్తును ఇచ్చారని కొనియాడారు. ఇదే సమయంలో, గత ప్రభుత్వంపై, ప్రతిపక్ష నేత జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

"ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి బేషరతుగా మద్దతు ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక రోజుకో మాటతో ఊసరవెల్లి రాజకీయాలు చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని అంటారు. వీళ్లకు ఏదైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? వీళ్లు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరిస్తారు, దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని" అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతికి రుణాలు రాకుండా ప్రపంచ బ్యాంకుకు ఈ-మెయిల్స్ పంపడం వంటి కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు.

చారిత్రక నేపథ్యం.. కోల్పోయిన రాజధానులు 
తెలుగువారి చారిత్రక వైభవాన్ని గుర్తుచేస్తూ, కృష్ణానది తీరంలోని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించారని చంద్రబాబు అన్నారు. బ్రిటిష్ మ్యూజియంలో సైతం ‘అమరావతి గ్యాలరీ’ మన ఘన చరిత్రకు నిదర్శనమని చెప్పారు. 

బ్రిటిష్ పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాభవాన్ని కోల్పోయామని, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, ఇప్పుడు విభజనతో దాన్ని కూడా కోల్పోయి అమరావతిని నిర్మించుకుంటున్నామని వివరించారు. రాజధానులు కోల్పోతూ వివక్ష, అవమానాలు భరిస్తూ వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ల విధ్వంసం 
2019లో ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ప్రజావేదికను కూల్చివేసి విధ్వంస పాలనకు నాంది పలికిందని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిని నాశనం చేసి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. 

రాజధాని కోసం పోరాడిన రైతులపై లాఠీలతో కొట్టి, బూట్లతో తన్ని, అక్రమ కేసులు పెట్టి ‘కీచకపర్వం’ సాగించారని దుయ్యబట్టారు. మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో అడ్డదారిలో ఆమోదింపజేయాలని చూసినా, న్యాయస్థానాలు అడ్డుకున్నాయని గుర్తుచేశారు. ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయని విమర్శించారు.

హైదరాబాద్ స్ఫూర్తి.. అమరావతి భవిష్యత్ 
తాను విజన్-2020తో సైబరాబాద్‌ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించానని, దాని ఫలితంగానే హైదరాబాద్ నగరం దేశంలోనే ‘మోస్ట్ లివబుల్ సిటీ’గా నిలిచి, రూ.1.05 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తోందని చంద్రబాబు తెలిపారు. అదే స్ఫూర్తితో అమరావతిని కూడా దేశం గర్వించేలా ‘బ్లూ అండ్ గ్రీన్ సిటీ’గా, భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 

రాజధాని ఒకటే అయినా, అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని, విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లను సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 2028 నాటికి పనులన్నీ పూర్తి చేసి అమరావతికి ఒక సంపూర్ణ రూపాన్ని తీసుకువస్తామని చంద్రబాబు శాసనసభకు హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
AP Capital
Legislative Assembly
YS Jagan
CRDA
Andhra Pradesh Reorganisation Act
Farmers Land
Political News

More Telugu News