Nara Lokesh: అసెంబ్లీలో "జై అమరావతి" నినాదాలు చేసిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 'జై అమరావతి' నినాదాలు మార్మోగాయి. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై జరిగిన చర్చలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ప్రసంగం మధ్యలో ఈ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాజధానిగా అమరావతే ఉంటుందని అబద్ధం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మూడు ముక్కలాట ఆడారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశంపై సభలో చర్చ జరుగుతుంటే జగన్ బెంగళూరులో ఉండటాన్ని లోకేశ్ తప్పుబట్టారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు చేసిన ఆందోళనలకు సంబంధించిన ఫొటోలను లోకేశ్ సభలో ప్రదర్శించారు. ప్రజలను, రైతులను మోసం చేసినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ' తమ ప్రభుత్వ విధానమని లోకేశ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అమరావతి రాజధాని తీర్మానానికి తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh Assembly
Amaravati
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Capital
AP Assembly
One State One Capital
Decentralization of Development

More Telugu News