Sanoj Mishra: మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తా: దర్శకుడు సనోజ్ మిశ్రా
కుంభమేళా సమయంలో ఒక్క ఫొటోతో రాత్రికి రాత్రే సెన్సేషన్ అయిన మోనాలిసా స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. సంచార తెగకు చెందిన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె... ఏకంగా సినీ రంగంలోకే అడుగుపెట్టేసింది. అయితే, ఫర్మాన్ ఖాన్ను మోనాలిసా భోంస్లే ప్రేమించి, పోలీసుల సమక్షంలో వివాహం చేసుకోవడంతో కథ కీలక మలుపు తీసుకుంది. ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వివాహం చట్టబద్ధంగా చెల్లదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాయి.
సరోజ్ మిశ్రా వ్యాఖ్యలపై కేరళలో జరిగిన విలేకరుల సమావేశంలో మోనాలిసా ఘాటుగా స్పందించారు. సినిమా షూటింగ్ సమయంలో ఆయన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేశారు. తన తొలి సినిమా అవకాశం కావడంతో కుటుంబ సభ్యుల సూచన మేరకు అప్పట్లో మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు నిజం బయటపెడుతున్నానని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, మోనాలిసా ఆరోపణలను సనోజ్ మిశ్రా పూర్తిగా కొట్టిపారేశారు. ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికీ తన ఇంట్లోనే ఉంటున్నారని, కేవలం పెళ్లిని వ్యతిరేకించినందుకే తనపై కక్షగట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. నటన నేర్పించేటప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు, నిజానిజాలు తేల్చేందుకు కోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు.