ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తాం: ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరిక

ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, గల్ఫ్, ఇజ్రాయెల్ దేశాల్లో పౌర ప్రాంతాలపై క్షిపణి దాడులు చేయవద్దని తాను, ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలిపారు. కానీ ఇరాన్ మాత్రం పౌర ప్రాంతాలపై దాడులు ఆపడం లేదని మండిపడ్డారు.

పదేపదే హెచ్చరించినప్పటికీ ఇరాన్ దాడులు ఆపడం లేదని, ఈ నేపథ్యంలో ఆ దేశంపై దాడులను తీవ్రతరం చేస్తామని కాట్జ్ హెచ్చరించారు. ఇరాన్‌లోని మరిన్ని ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేస్తామని పేర్కొన్నారు. ఈ యుద్ధ నేరానికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వ్యాఖ్యానించారు.

క్షిపణి తయారీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం

టెహ్రాన్‌లోని బాలిస్టిక్ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఈరోజు తెలిపింది. పశ్చిమ ఇరాన్ ప్రాంతంలోని క్షిపణి ప్రయోగ, నిల్వ కేంద్రాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. కాగా, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలవుతోంది. ఈ కాలంలో ఇరాన్‌పై 850కి పైగా తోమహక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది.


More Telugu News