హర్మూజ్‌లో తీవ్ర ఉద్రిక్తత... చమురు ట్యాంకర్‌ను ధ్వంసం చేసిన ఇరాన్... వీడియో వైరల్!

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

దాడికి గురైన ట్యాంకర్ పాకిస్థాన్ జెండాతో ఉన్నట్లు పలు కథనాలు సూచిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జలసంధిని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ దాడి చేసినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, పాకిస్థాన్ జెండా చాటున చమురును అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకుని, పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో సిబ్బంది ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుంది. తమ అనుమతి లేకుండా ఏ నౌక ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం స్తంభించిపోగా, 85కి పైగా ట్యాంకర్లు గల్ఫ్‌లోనే చిక్కుకుపోయాయి. మార్చి 11న కూడా థాయ్‌లాండ్‌కు చెందిన నౌకపై దాడి జరిగింది.

ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. తాజా ఘటనతో ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమయ్యాయి. సంక్షోభం ముదరకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.


More Telugu News