అస్సలు గుర్తుపట్టలేకపోయా.. రోహిత్ కొత్త లుక్‌పై నీతా అంబానీ ఆశ్చర్యం!

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త లుక్ చూసి ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు గుర్తుపట్టలేకపోయానని, యంగ్ బాయ్‌లా కనిపిస్తున్నావంటూ ఆమె ప్రశంసించారు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంపులో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

రేప‌టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై క్యాంపును సందర్శించిన నీతా అంబానీ ఆటగాళ్లను, కోచింగ్ సిబ్బందిని పలకరించారు. కోచ్‌లు మహేల జయవర్దనే, లసిత్ మలింగ, కీరన్ పోలార్డ్‌లతో మాట్లాడుతున్న క్రమంలో పక్కనే హెల్మెట్ పెట్టుకుని ఉన్న రోహిత్‌ను ఆమె మొదట గమనించలేదు. ఆ తర్వాత దగ్గరికి వచ్చి చూసి.. "మై గాడ్, రోహిత్ నువ్వా.. అస్సలు గుర్తుపట్టలేకపోయాను. నువ్వు చూడటానికి యంగ్ బాయ్‌లా ఉన్నావు" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నీతా అంబానీ మాటలకు రోహిత్ శర్మ సిగ్గుపడుతూ నవ్వేశారు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇక‌, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత హిట్‌మ్యాన్‌ తన ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన, అందుకోసం భారీగా బరువు తగ్గారు. గతేడాది అక్టోబర్‌లోనే తన మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన రోహిత్, ఇప్పుడు తన ఫ్రాంఛైజీ ఓనర్‌ను కూడా ఆశ్చర్యానికి గురిచేయడం విశేషం.


More Telugu News