గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది. 'జగ్ వసంత్' అనే పేరు గల ఈ నౌక, 42,000 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)తో శుక్రవారం గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు వచ్చింది. హర్మూజ్ జలసంధి మూసివేత భయాల నడుమ ఈ నౌక తన ప్రయాణ మార్గంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

సోమవారం 'పైన్ గ్యాస్' అనే మరో ట్యాంకర్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించిన 'జగ్ వసంత్'.. సంప్రదాయ మార్గానికి బదులుగా ఖేష్మ్-లారక్ ఛానెల్ ద్వారా హర్మూజ్ జలసంధిని దాటింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తమను స్పష్టంగా భారతీయ నౌకలుగా గుర్తించేందుకు 'IND SHIP AND CREW', 'JGVASNTINDSHIPINDCRW' వంటి సందేశాలను ప్రసారం చేశాయి. ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతితోనే ఈ నౌకలు ఇలా ప్రయాణించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో భారత్‌కు సురక్షితంగా చేరుకున్న మూడో ఎల్‌పీజీ ట్యాంకర్ ఇది. ఇప్పటికే 'శివాలిక్', 'నందా దేవి' అనే మరో రెండు నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, వాడినార్ ఓడరేవులకు చేరుకున్నాయి. ఆ రెండు నౌకలు కలిపి 92,000 టన్నులకు పైగా ఎల్‌పీజీని తీసుకొచ్చాయి. 'జగ్ వసంత్' హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా ముందే వెల్లడించారు. ప్రస్తుతం కాండ్లా పోర్టుకు చేరిన ఈ నౌక నుంచి ఎల్‌పీజీ బదిలీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.


More Telugu News