ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. శ్రీరామ నవమి పండుగ, వారాంతపు సెలవులు ఒకేసారి రావడంతో మార్చి 27 నుంచి 29 వరకు బ్యాంకులు పనిచేయవు. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి, తమ బ్యాంకు పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మార్చి 27 నేడు శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవు ప్రకటించింది. దీనికి తోడు, మార్చి 28న నాలుగో శనివారం, మార్చి 29న ఆదివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతుంది. తిరిగి సోమవారం, మార్చి 30న బ్యాంకులు తెరుచుకుని సేవలను పునఃప్రారంభిస్తాయి.

ఈ మూడు రోజులు చెక్ క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, డాక్యుమెంట్ సబ్మిషన్, లోన్ దరఖాస్తులు వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అయితే, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి. ఆన్‌లైన్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News