ఇరాన్ నుంచి మాకు గిఫ్ట్ వచ్చింది... 10 చమురు ట్యాంకర్లను పంపించింది: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

ఇరాన్ నుంచి తమకు పెద్ద గిఫ్ట్ వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ 10 చమురు ట్యాంకర్లను పంపించిందని ఆయన తెలిపారు. హర్మూజ్ జలసంధి గుండా వీటిని పంపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ జలసంధి వద్ద ఇరాన్ ఎలాంటి టోల్ ఛార్జీని వసూలు చేయలేదని అన్నారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. హర్మూజ్ మీదుగా వస్తున్న ఆయా ట్యాంకర్లపై పాకిస్థాన్ జెండాలు ఉన్నట్లు వెల్లడించారు.

పశ్చిమాసియాను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ భావించిందని, కానీ తాము అడుగుపెట్టేసరికి వారికి కష్టంగా మారిందని ట్రంప్ అన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. పశ్చిమాసియాను స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వద్ద పక్కా ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. అందుకే ఆ దేశాల పైకి క్షిపణులను ప్రయోగించిందని అభిప్రాయపడ్డారు.

గల్ఫ్ దేశాల పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని యుద్ధం ప్రారంభానికి చాలాకాలం ముందే గురిపెట్టి ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఆయుధాలను లోడ్ చేసి దాడులకు సిద్ధంగా ఉంచిందని ఆరోపించారు. అయితే అమెరికా దాడి నేపథ్యంలో అంతా నిర్వీర్యమైందని అన్నారు. 

ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి

ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ అన్నారు. యుద్ధాన్ని నిలిపివేసేందుకు రూపొందించిన పదిహేను పాయింట్ల ప్రణాళికను ఇరాన్ ముందు ఉంచినట్లు అమెరికా వెల్లడించింది. ఒప్పందం కుదురుతుందని, ఉద్రిక్తతలు తగ్గుతాయని స్టీవ్ విట్కాఫ్ అభిప్రాయపడ్డారు.


More Telugu News