గతేడాది వైఫల్యాలకు చెక్.. కొత్త ఓపెనర్లను ప్రకటించిన సీఎస్కే కెప్టెన్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ ఓపెనింగ్ జోడీపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించింది. ఈ సీజన్‌లో తానే ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని, తనతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అధికారికంగా ప్రకటించాడు. ముంబైలో జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో చెన్నై టాప్ ఆర్డర్‌పై స్పష్టత వచ్చింది.

గత సీజన్‌లో సీఎస్కే ప్రదర్శన బాగా నిరాశపరిచింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఓపెనింగ్ స్థానం కోసం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి వంటి పలువురిని ప్రయత్నించినా ఏ ప్రయోగమూ ఫలించలేదు. దీంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం సీజన్ మధ్యలో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. చివర్లో యువ ఆటగాళ్లు ఆయుశ్‌ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ జట్టులోకి వచ్చి పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి మెరుగైన ఆరంభాలు ఇచ్చారు.

అయితే, ఐపీఎల్ 2026 కోసం ఫ్రాంచైజీ యాజమాన్యం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌తో సంచలన ట్రేడింగ్ జరిపింది. స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు ఇచ్చి, వారి నుంచి సంజు శాంసన్‌ను దక్కించుకుంది. ఇప్పుడు అనుభవానికే పెద్దపీట వేస్తూ రుతురాజ్, సంజూ జోడీని ఓపెనర్లుగా ఎంచుకుంది. గత సీజన్‌లో మాత్రే 7 ఇన్నింగ్స్‌లలో 189 స్ట్రైక్ రేట్‌తో 240 పరుగులు చేయగా, బ్రెవిస్ 6 ఇన్నింగ్స్‌లలో 180 స్ట్రైక్ రేట్‌తో 225 పరుగులు సాధించాడు.

ఈ కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్, తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల‌ 30న గువాహ‌టిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో తొలి హోమ్ మ్యాచ్, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మరో మ్యాచ్ ఆడనుంది.


More Telugu News