రాజకీయాలను పక్కనపెట్టి.. భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న సంక్షోభం నుంచి నేతన్నలను గట్టెక్కించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. ఈరోజు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఆయన, సిరిసిల్ల నియోజకవర్గంలోని పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ భేటీ అందరినీ ఆకట్టుకుంటోంది.


సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న సుమారు రూ. 38 కోట్ల విద్యుత్ బకాయిలు, పేరుకుపోయిన బ్యాక్ బిల్లింగ్, సర్‌ఛార్జ్‌లను తక్షణమే మాఫీ చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంను కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న విధంగానే పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో నేతన్నలు మళ్ళీ ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం ఉందని, వారికి తక్షణమే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు.

కేటీఆర్ వివరించిన సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. నేతన్నల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అని, విద్యుత్ బకాయిల అంశాన్ని లోతుగా పరిశీలించి కార్మికులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షోభ నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.



More Telugu News