ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తాం: సిద్ధిపేట ప్రజలకు రేవంత్ రెడ్డి ఆఫర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్దిపేట గడ్డపై సంచలన రాజకీయ హామీ ఇచ్చారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యేను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన రైతు మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేట రాజకీయాల్లో మార్పు తప్పనిసరని సీఎం పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యేను మంత్రిని చేసే బాధ్యతను తాను, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి తీసుకుంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఒక్కోదానికి 3,500 చొప్పున మొత్తం 10,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై వస్తున్న విమర్శలకు సీఎం బదులిచ్చారు. సిద్దిపేట రైతుల మేలు కోసమే ఫ్యాక్టరీని ఇక్కడే కొనసాగిస్తున్నామని, తలుచుకుంటే దానిని తన నియోజకవర్గం కొడంగల్‌కు తరలించుకునేవాడినని అన్నారు. కానీ, స్థానిక రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేశామని చెప్పారు. తాను ఎమ్మెల్యేల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల కోసం రైతులను భయపెట్టి భూములు లాక్కుందని, కానీ తాము నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కోసం 98.5 శాతం మంది రైతులకు మెరుగైన పరిహారం ఇచ్చి ఒప్పించామని వివరించారు.

"ఒక్కసారి మార్పు చేసి చూడండి.. మంచి జరుగుతుందో లేదో మీకే తెలుస్తుంది" అని సిద్దిపేట ప్రజలను కోరారు. చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించి 2029లో కాంగ్రెస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో సిద్దిపేట రాజకీయాలు మరింత వేడెక్కాయి.


More Telugu News