ప్రయాణం మధ్యలో చిన్నారికి వైద్యం... భారతీయ రైల్వే సేవలపై ఓ తల్లి ఆశ్చర్యం

బెంగళూరు నుంచి గుజరాత్ వెళుతున్న రైలులో అనారోగ్యానికి గురైన తన చిన్నారికి భారతీయ రైల్వే శాఖ అద్భుతమైన రీతిలో సహాయం అందించిందని ఓ తల్లి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ హృద్యమైన ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే, డెంటిస్ట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ మార్చి 13న తన బిడ్డతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో చిన్నారికి మునగకాయ సూప్ ఇవ్వగా, కొద్దిసేపటికే చిన్నారి తీవ్రంగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. కదిలే రైలులో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందిన ఆ తల్లి, వెంటనే రైలు టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ని సంప్రదించి వైద్య సహాయం కోసం అడిగారు.

ఆమె అభ్యర్థనపై రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించారు. టీటీఈ ద్వారా సమాచారం అందుకున్న అధికారులు, రైలు తదుపరి స్టేషన్ అయిన హిందూపూర్‌కు చేరుకునేసరికే అక్కడ ఒక వైద్యుడిని సిద్ధంగా ఉంచారు. డాక్టర్ చిన్నారిని పరీక్షించి, అవసరమైన మందులు అందించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి సరైన బిల్లు కూడా ఇవ్వడం గమనార్హం.

రైల్వే శాఖ చూపిన చొరవకు ఆశ్చర్యపోయిన ఆ తల్లి, తన అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. "ఆందోళన నుంచి ఉపశమనం పొందాను. నా బిడ్డకు సహాయం ఊహించిన దానికంటే వేగంగా అందింది. తక్షణ వైద్య సహాయం, సరైన సంరక్షణ, పారదర్శకత చూపిన భారతీయ రైల్వేకు ధన్యవాదాలు" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ప్రయాణాల్లో ఇలాంటి అత్యవసర పరిస్థితులు వస్తే కంగారు పడకుండా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు.

ఈ వీడియోకు సోషల్ మీడియాలో 25 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు రైల్వే సిబ్బంది సేవలను కొనియాడుతూ "రైల్వే సిబ్బందికి సెల్యూట్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.


More Telugu News