జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం

సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మోసానికి గురయ్యారు. గుర్తుతెలియని నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును కాజేశారు. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యే బాలరాజు మొబైల్‌కు ఆర్టీఏ (ఆర్టీఏ) చలానా చెల్లించాలంటూ ఓ మేసేజ్ రావడంతో అందులో ఉన్న లింక్‌ను ఆయన నిజమైనదని భావించి క్లిక్ చేశారు. ఆ లింక్ ద్వారా ఆయన ఫోన్‌లో ఓ మాల్వేర్ యాప్ ఇన్‌స్టాల్ అయినట్లు తెలుస్తోంది. అది క్లిక్ చేసిన కొద్దిసేపటికే, జంగారెడ్డిగూడెంలోని ఇండస్‌ఇండ్ బ్యాంకులో ఉన్న ఆయన ఖాతా నుంచి సుమారు రూ. 12 లక్షలు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు.

తన ఫోన్ హ్యాక్ అయిందని, ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్‌కు గురైన ఎమ్మెల్యే బాలరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐపీ అడ్రస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News