పంజాబ్ అధికారి ఆత్మహత్య.. మంత్రి రాజీనామా, కేసు నమోదు
- మంత్రి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానన్న అధికారి
- వీడియో రికార్డ్ చేసి బలవన్మరణానికి పాల్పడిన గగన్దీప్ సింగ్
- సీఎం భగవంత్ మాన్ ఆదేశాలతో మంత్రి లాల్జిత్ భుల్లర్ రాజీనామా
- మాజీ మంత్రి, ఆయన తండ్రిపై ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు
పంజాబ్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పనిచేస్తున్న గగన్దీప్ సింగ్ రంధావా శనివారం తెల్లవారుజామున విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు ఆయన రికార్డ్ చేసిన 12 సెకన్ల వీడియోలో "మంత్రి లాల్జిత్ భుల్లర్ భయంతోనే నేను విషం తాగుతున్నాను. నేను ఇక బతకను" అని పేర్కొన్నారు. టెండర్ల విషయంలో మంత్రి తనను తీవ్రంగా వేధించారని, గన్పాయింట్తో బెదిరించి తప్పుడు వీడియోలు రికార్డ్ చేయించుకున్నారని రంధావా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఉదంతంపై సీఎం భగవంత్ మాన్ వెంటనే స్పందించి, విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో మంత్రి భుల్లర్ రాజీనామాను తీసుకున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమృత్సర్ పోలీస్ కమిషనరేట్ నివేదికల ప్రకారం, రాజీనామా అనంతరం అమృత్సర్ పోలీసులు మాజీ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లర్, ఆయన తండ్రి సుఖ్దేవ్ సింగ్లపై 'ఆత్మహత్యకు ప్రేరేపించడం' కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంత్రి నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, ప్రతిపక్ష కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది.