Chandrababu Naidu: లక్ష ఉద్యోగాలతో ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Inaugurate Steel Plant with One Lakh Jobs in AP
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ ముందడుగు పడుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు గత 21 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు ఉత్పాదక సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా), రాష్ట్రంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈనెల 23వ తేదీన (సోమవారం) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులతో కలిసి భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్నే మార్చగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

లక్ష ఉద్యోగాలతో భారీ ప్రాజెక్టు

సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో 5,465 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. తొలిదశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఈ ప్లాంట్ ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు డిమాండ్‌ను అందుకోవడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషించనుంది.

అనుబంధంగా క్యాప్టివ్ పోర్టు.. మరో 6,000 ఉద్యోగాలు

ఈ భారీ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఏఎంఎన్ఎస్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా ఒక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించనుంది. ఇందుకోసం అదనంగా రూ.11,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 316 ఎకరాల్లో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తారు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టు రాకతో విశాఖ ఎకనమిక్ రీజియన్ ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా (హబ్) రూపాంతరం చెందనుంది.

ప్రభుత్వం సంపూర్ణ సహకారం 

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను శరవేగంగా కల్పిస్తోంది. ప్లాంట్‌ను జాతీయ రహదారి-16తో అనుసంధానించేందుకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులను కూడా ప్రభుత్వం చేపట్టింది.

సీఎం పర్యటన వివరాలు

సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆయన అమరావతి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 గంటలకు ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సందర్శించి, ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ నమూనాను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించి, అవగాహన ఒప్పందాల కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక తిరిగి అమరావతికి పయనమవుతారు.

ఈ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, టి.జి. భరత్, ఎంపీ సి.ఎం. రమేశ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Arcelor Mittal
AMNS India
Steel Plant Andhra Pradesh
Anakapalli District
Nakkapalli
Greenfield Steel Plant
AP Industrial Development
Visakha Economic Region
Lakshmi Mittal

More Telugu News