బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరో షాక్
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ పార్టీ ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొయినాబాద్లోని అజీజ్నగర్ ఫామ్హౌస్పై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో డ్రగ్స్ కోణంతో పాటు భూ అక్రమాల వ్యవహారం కూడా బయటపడింది. డ్రగ్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ ఫామ్హౌస్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అక్కడ ఉన్న విలాసవంతమైన వాహనాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో ఫామ్ హౌస్ ఉన్న అసైన్డ్ భూమి వివాదం తెరపైకి వచ్చింది. సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్హౌస్ను నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో 2006లో ఈ భూమి రిజిస్ట్రేషన్ అయినట్టు రికార్డుల్లో ఉంది. అయితే, భూభారతి రికార్డుల ప్రకారం ఇది 'జంగయ్య' అనే వ్యక్తి పేరు మీద ఉండటం గమనార్హం. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని విక్రయించడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో... అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఇందులో అధికారుల పాత్ర ఏంటి? అనే అంశాలపై సిట్, రెవెన్యూ విభాగం లోతుగా విచారిస్తున్నాయి.