పీఎస్యూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కి పెంపు.. సానుకూలంగా ప్రభుత్వం!
- ప్రతిపాదనకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం
- రాష్ట్రవ్యాప్తంగా 8,500 మందికి లబ్ధి చేకూరే అవకాశం
- త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్
ఈ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, పురపాలక శాఖ మంత్రి నారాయణలతో కూడిన కమిటీ ఇప్పటికే సమావేశమైంది. పదవీ విరమణ వయసు పెంపునకు ఈ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు డిమాండ్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై దృష్టి సారించి, మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వయసు పెంపు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను కూడా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.