నిర్ణయంలో ఎలాంటి మార్పులేదు, దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని జగిత్యాల నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం తదితరులు ఈరోజు జీవన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. పార్టీ మారతానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో మంత్రులు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

జీవన్ రెడ్డితో మంత్రులు గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాను అనుకున్న తేదీలోనే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని, అందుకే తాను పార్టీ వీడుతున్నానని జీవన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

కాగా, జీవన్ రెడ్డి అధిష్ఠానాన్ని కలవడానికి అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశం కావాల్సి ఉంది. కానీ ఆయన జగిత్యాలలోనే ఉండిపోయారు. అధిష్ఠానం నుంచి జీవన్ రెడ్డికి ఎలాంటి ఫోన్ రాలేదని ఆయన వర్గం నాయకులు చెబుతున్నారు. నేడు మంత్రులతో జరిగిన చర్చలు కూడా విఫలమైనట్లు జీవన్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు.


More Telugu News