Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడి ధర.. మధ్య తరగతి గుండెల్లో రైళ్లు!
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఆదివారం భోజనం భారంగా మారబోతోంది. నిన్నటి వరకు సాదాసీదాగా ఉన్న కోడి మాంసం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. కేవలం ఒక్క రోజులోనే భారీగా ధరలు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఏపీలో నిన్నటి కంటే ఈరోజు ఏకంగా రూ. 70 అదనంగా పెరగడం గమనార్హం.
విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 380 నుండి రూ. 400 వరకు పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో చికెన్ రూ. 340 నుండి రూ. 350 మధ్య విక్రయిస్తున్నారు. అసలు దీని ధర అడిగితేనే గుండె జారిపోయేలా ఉంది. కిలో నాటుకోడి ఏకంగా రూ. 800 పలుకుతోంది. అంటే దాదాపు మటన్ ధరతో పోటీ పడుతోంది.
వ్యాపారులు మరియు పౌల్ట్రీ రైతుల విశ్లేషణ ప్రకారం ఈ పెరుగుదల వెనుక ఐదు కీలక కారణాలు ఉన్నాయి. తీవ్రమైన ఎండల వల్ల కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో మార్కెట్లోకి రావాల్సిన సప్లై గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రంజాన్ పండుగ కావడంతో చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ రెట్టింపయింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగాయి. అలాగే కోళ్లకు వేసే దానా ధరలు కూడా పెరగడంతో పౌల్ట్రీ రైతులు రేట్లు పెంచక తప్పడం లేదు.