Roja: చంద్రబాబుపై రోజా నిప్పులు.. బీఆర్ నాయుడుపై విమర్శలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాంగ శ్రవణం సాక్షిగా ప్రజలకు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉన్నారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆమె ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఇస్తామన్న హామీ ఏమైంది? అది కేవలం ఓట్ల కోసమేనా? అని ఆమె ప్రశ్నించారు.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గత జగనన్న పాలనలో రైతులు, పేదలు ఎలా సంతోషంగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసని ఆమె గుర్తు చేశారు. నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువతను నట్టేట ముంచారని, రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీరుపై కూడా రోజా విమర్శలు గుప్పించారు. టీటీడీ ఛైర్మన్ పదవి నాకు అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి అని బీఆర్ నాయుడు అన్నారని ఆమె మండిపడ్డారు. "అర్హత లేని వారికి పదవులు ఇస్తే ఇలానే మాట్లాడుతారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. అలాంటి వ్యక్తులను తరిమి తరిమి కొట్టాలి" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.