APSDMA: పంట నష్టపోయిన రైతులకు సర్కార్ భరోసా.. ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన

APSDMA assures support to farmers after crop loss due to rains
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తమిళనాడు నుంచి కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతున్నాయని ప్రఖర్ జైన్ వివరించారు. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మినుము, మిరప, పసుపు ఆరబెట్టిన ఇతర పంటలను తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, పొలాల్లో ఉండరాదని, ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు. ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Go Back to Shorts
APSDMA
Andhra Pradesh rains
AP weather forecast
crop damage
Prahar Jain
farmer compensation
AP agriculture
Srikakulam
Vizianagaram
Prakasam

More Telugu News