Bhatti Vikramarka: నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Applauds Revanth Reddys Initiative to Restart Cinema Awards
షార్ట్స్‌లో చూడండి
నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సుమారు పదేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ సినీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పునఃప్రారంభించారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను ఏర్పాటు చేయడం ఆయనకు ఇచ్చే అసలైన గౌరవమని అన్నారు. ‘గద్దర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయనొక వ్యవస్థ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఇక్కడి పాటను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం గర్వకారణం‘ అని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితో పదేళ్ల తర్వాత ఈ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ నేడు కేవలం దేశానికే పరిమితం కాకుండా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని భట్టి విక్రమార్క ప్రశంసించారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు, అది ప్రజల కోసం ఉండాలి. ‘సత్య హరిశ్చంద్ర’, ‘కన్యాశుల్కం’ వంటి చిత్రాలు సమాజంలో మార్పు తెచ్చాయని గుర్తుచేశారు. సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు నేడు వాణిజ్యపరంగా కూడా విజయవంతం కావడం అభినందనీయమన్నారు.

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నేతృత్వంలోని జ్యూరీ అత్యంత పారదర్శకంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిందని డిప్యూటీ సీఎం కొనియాడారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున వంటి దిగ్గజాలు హాజరుకావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అవార్డులు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులోనూ మంచి పాత్రలతో సమాజానికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
Go Back to Shorts
Bhatti Vikramarka
Revanth Reddy
Telangana cinema awards
Gaddar
Telugu film industry
Chiranjeevi
Kamal Haasan
Dil Raju
Film Development Corporation

More Telugu News