Kishan Reddy: 'శ్రీ పరాభవ నామ సంవత్సరం'పై కిషన్ రెడ్డి ఆసక్తికర విశ్లేషణ
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉగాది శోభతో కళకళలాడింది. 'శ్రీ పరాభవ నామ సంవత్సర' ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలుగు ప్రజలందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పండితులు వినిపించిన పంచాంగ శ్రవణం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పండితులు వివరించిన పంచాంగం ప్రకారం... ఈ ఏడాది దేశ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉందని కిషన్రెడ్డి తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని, రైతులు సుఖసంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో సతమతమవుతున్నా, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మాత్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గుర్తు చేశారు.
ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితానికి ప్రతీక అని, తీపి-వగరు-చేదు అన్నీ కలిస్తేనే జీవితమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా నిలబడితే ఏ సమస్యనైనా అధిగమించవచ్చని అన్నారు.