Chandrababu Naidu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు.. నేతలు ఏమన్నారంటే...!

Chandrababu Naidu Grand Ugadi Celebrations at TDP Central Office
షార్ట్స్‌లో చూడండి
తెలుగువారి నూతన సంవత్సరాది 'పరాభవ' నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ గారు నిర్వహించిన పంచాంగ శ్రవణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని పంచాంగ సారాంశాన్ని నేతలు విశ్లేషించారు.

ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ, రాష్ట్రం గత పాలకుల చీకటి నీడ నుంచి పూర్తిగా బయటపడిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడా కల్తీ లేని, పూర్తి పారదర్శకమైన పాలన అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. "ఒకనాడు దేవతల రాజధానిగా వెలుగొందిన అమరావతి, మళ్లీ మన కళ్లముందే అద్భుతమైన రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి నిర్మాణమే వెన్నెముక. అమరావతి నిర్మాణానికి నాందిగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ జరగడం తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక" అని ఆయన కొనియాడారు. సిద్ధాంతి చెప్పిన విషయాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయని, చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆయన నిగూఢంగా చెప్పారని విశ్లేషించారు. భవిష్యత్తులో ప్రత్యర్థులకు రాష్ట్రంలో స్థానమే ఉండదని సిద్ధాంతి స్పష్టం చేశారని, ప్రజల మద్దతు కూడా అదే దిశగా ఉందని పేర్కొన్నారు.

అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ గారి పంచాంగ శ్రవణం విన్న తర్వాత రాష్ట్ర భవిష్యత్తుపై మరింత నమ్మకం కలిగిందన్నారు. "సిద్ధాంతి గారు చెప్పినట్లుగానే ఈ ఏడాది రాష్ట్రం అన్ని విధాలా బాగుంటుంది. సిరిసంపదలతో వర్ధిల్లుతుంది. సీఎం చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటూ 'స్వర్ణాంధ్రప్రదేశ్' లక్ష్యాలను చేరుకోవాలి" అని ఆకాంక్షించారు. యువనేత నారా లోకేశ్ విద్యాశాఖ వంటి కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్ తరాల తలరాతను మార్చే ఈ శాఖను ఆయన విజయవంతంగా ముందుకు నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ, సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ గారు టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేయడం ఇది మూడోసారని గుర్తుచేశారు. "2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ 135 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. ఆయన చెప్పినట్లే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయన ప్రవచనం ప్రకారం రాబోయే కాలంలో కూడా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం, వాస్తవాలను కళ్లకు కట్టినట్లు వివరించిన సిద్ధాంతి గారిని నేతలు ఘనంగా సత్కరించారు.

ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌, ఏపీ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్, ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపీ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామకృష్ణరాజు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Ugadi Celebrations
TDP Office
Varla Ramaiah
Palla Srinivasarao
Nara Lokesh
AP Politics
Telugu New Year
Panchangam
Amaravati

More Telugu News