YS Sharmila: జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు: వైఎస్ షర్మిల

YS Sharmila Slams Brother Jagan Over Viveka Murder Case
షార్ట్స్‌లో చూడండి
"జగన్ లాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అనే పదానికే జగన్మోహన్ రెడ్డి ఒక కళంకం," అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని, బాధితురాలైన సునీతకు న్యాయం చేయకుండా వెలివేశారని ఆమె  విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు.

డబ్బు, మీడియా, పలుకుబడి ఉందన్న అహంకారంతో ఎంతటి నేరాలనైనా కప్పిపుచ్చవచ్చని, సోషల్ మీడియాలోని తమ సైతాన్ సైన్యంతో ఎవరిపైనైనా వ్యక్తిగత హననానికి పాల్పడొచ్చని అనుకుంటున్నారని షర్మిల దుయ్యబట్టారు. వివేకా గుండెపోటుతో చనిపోయారనే థియరీని సునీత సృష్టించిందని అవినాష్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. "వివేకా చనిపోయిన రోజు ఉదయం 7 గంటల నుంచే సాక్షి టీవీలో గుండెపోటుతో మరణించారని వార్తలు ప్రసారం చేశారు. ఆ సమయంలో సునీత, మేమంతా హైదరాబాద్‌లో షాక్‌లో ఉన్నాం. పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా సాక్షి టీవీలో ఆ వార్త ఎలా వచ్చింది? సాక్షి టీవీని నడుపుతున్నది జగన్ భార్య భారతి రెడ్డి కాదా? దీనిపై అవినాష్ గానీ, భారతి రెడ్డి గానీ ఎందుకు సమాధానం చెప్పరు?" అని షర్మిల సూటిగా ప్రశ్నించారు.

శవపరీక్ష జరగకుండా అడ్డుకునే అవకాశం, మీడియాను మేనేజ్ చేసే అవకాశం స్థానికంగా ఉన్న అవినాష్ రెడ్డికే ఉందని, దూరంగా ఉన్న సునీతకు కాదని ఆమె స్పష్టం చేశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, వివేకా హత్యపై తాము చెప్తున్న థియరీలే నిజమైతే ఒక్క ఆధారాన్నైనా ఎందుకు బయటపెట్టలేకపోయారని నిలదీశారు. "సునీత భర్త హత్య చేశాడని, టీడీపీ వాళ్లు చంపించారని, మరో కుటుంబం హత్య చేసిందని ఆరోపణలు చేశారు. అధికారం చేతిలో పెట్టుకుని ఒక్క సాక్ష్యం కూడా ఎందుకు చూపలేదు? ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు కాబట్టి," అని షర్మిల అన్నారు.

వివేకా హత్య వెనుక ఉన్నది ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ వివాదమేనని షర్మిల పునరుద్ఘాటించారు. "కడప ఎంపీ టికెట్‌కు అవినాష్ రెడ్డి సరైన వ్యక్తి కాదని చిన్నాన్న వివేకానంద రెడ్డి గట్టిగా నమ్మారు. ఈ విషయం నాతోనే రెండు గంటల పాటు చర్చించారు. అయినా జగన్ టికెట్ అవినాష్‌కే ఇచ్చారు. ఈసారి అడ్డుపడిన వివేకా, భవిష్యత్తులో ఎప్పటికీ అడ్డంకిగా ఉంటారని భావించే ఈ హత్యకు పాల్పడ్డారు," అని ఆమె వివరించారు.

అన్నగా జగన్ న్యాయం చేయకపోవడం వల్లే సునీత ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందని, చంద్రబాబు నాయుడి గడప తొక్కాల్సి వచ్చిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. "బాధితుల పక్షాన నిలబడకుండా, నిందితుల వైపు నిలబడ్డారు. తన తండ్రి మరణం వెనుక నిజం కోసం ఏడేళ్లుగా ఒంటరి మహిళగా పోరాడుతున్న సునీతను చూస్తే జగన్‌కు కనీసం జాలి కూడా కలగలేదా? రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే ఈ విషయంలో ఎంత బాధపడేవారో," అంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం పోరాడుతుంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా సీబీఐని, బీజేపీని నిలదీయాల్సిన బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు.

Go Back to Shorts
YS Sharmila
YS Jagan
YS Vivekananda Reddy
Viveka murder case
AP Congress
YS Avinash Reddy
Sunitha Reddy
Andhra Pradesh politics
Kadapa MP seat
Chandrababu Naidu

More Telugu News