సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజయం సాధించడం వెనుక స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసించారు. కీలక సమయంలో అతడిపై జట్టు యాజమాన్యం ఉంచిన నమ్మకమే భారత్‌ను గెలిపించిందని అభిప్రాయపడ్డారు.

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి విజేతగా నిలిచి భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. టోర్నీలో అజేయంగా సూపర్ 8కి చేరిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ అవకాశాన్ని సంజు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును సైతం గెలుచుకున్నాడు.

ఈ నిర్ణయంపై రికీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘ఇషాన్ కిషన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు పంపి, సంజు శాంసన్‌తో ఓపెనింగ్ చేయించడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. సంజు వల్లే టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ఒక ఆటగాడి భుజంపై చేయి వేసి 'నిన్ను నమ్ముతున్నాం, ఈ పాత్రకు నువ్వే సరైన వ్యక్తి' అని భరోసా ఇస్తే అద్భుతాలు చేస్తారు. టీమిండియా యాజమాన్యం సరిగ్గా అదే చేసింది’ అని కొనియాడారు. కేవలం టీ20ల్లోనే కాకుండా వన్డేల్లో, ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో భారత్ అద్భుతంగా ఆడుతోందని పాంటింగ్ పేర్కొన్నాడు.


More Telugu News