Siddaramaiah: రైల్వే శాఖపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్... ఎందుకంటే...!

Siddaramaiah Slams Railway Ministry Over Exam Cancellation
షార్ట్స్‌లో చూడండి
రైల్వే ఉద్యోగుల ప్రమోషన్ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైల్వే శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరీక్షలను కన్నడ భాషలో రాసేందుకు అవకాశం కల్పించకపోవడంతో కన్నడ సంఘాలు నిరసన చేపట్టాయి. దీంతో రైల్వే శాఖ హఠాత్తుగా పరీక్షలను రద్దు చేసింది. ఈ చర్యను సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.

మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో, నైరుతి రైల్వే పరిధిలో 194 గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు, హుబ్బళ్లి డివిజన్‌లో 101 ఎల్‌డీసీఈ పోస్టుల ప్రమోషన్ల కోసం జరగాల్సిన పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేశారని తెలిపారు. ఈ ఆకస్మిక నిర్ణయంతో కన్నడ ఉద్యోగులు తీవ్ర గందరగోళానికి, అనిశ్చితికి గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షను కన్నడలో నిర్వహించాలని వేలాది మంది ఉద్యోగులు, పలు సంస్థలు శాంతియుతంగా విజ్ఞప్తి చేసినప్పటికీ రైల్వే శాఖ పట్టించుకోలేదని సిద్ధరామయ్య ఆరోపించారు. నిరసనలు ఉధృతమయ్యాక హడావుడిగా పరీక్షను రద్దు చేయడం ఖండనీయమని పేర్కొన్నారు. "మొదట్లోనే ఈ సమస్యను గుర్తించి, కన్నడలో పరీక్షకు అనుమతి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైల్వే శాఖ కన్నడ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోంది," అని ఆయన విమర్శించారు.

కర్ణాటకకు చెందిన వి. సోమన్న రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని సిద్ధరామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ హిందీ అనుకూల విధానం వల్లే ప్రాంతీయ భాషలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య కోరారు. రద్దు చేసిన రైల్వే పరీక్షలను వెంటనే తిరిగి నిర్వహించాలని, వాటిని కన్నడలో కూడా రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక భాషను మరో భాషపై రుద్దడాన్ని సహించబోమని, భవిష్యత్తులో భాష పేరుతో కన్నడిగులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Siddaramaiah
Karnataka CM
Railway Recruitment
Kannada Language
Railway Exams
South Western Railway
Hubballi
V Somanna
Narendra Modi
Language Policy

More Telugu News