మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు.. వీడియో ఇదిగో!

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమన్ నెతన్యాహు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొత్త వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఓ పర్యాటక ప్రాంతంలో తీసిన ఈ వీడియోలో నెతన్యాహు జనంలోకి వెళ్లడం, వారిని పలకరించడం చూడొచ్చు. ఇటీవల నెతన్యాహు పోస్ట్ చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయన్న పోస్టు నెట్టింట వైరల్ అయింది.

దీంతో నెతన్యాహు ఓ కాఫీ షాపుకు వెళ్లి కాఫీ తాగుతూ వీడియో విడుదల చేశారు. తన చేతి వేళ్లు చూపిస్తూ.. ‘‘వేళ్లు లెక్కిస్తున్నారా.. ఇదిగో చూడండి. నా చేతికి ఐదు వేళ్లే ఉన్నాయి కదా. బాగా చూడండి. నా చేయి చాలా అందంగా ఉంది కదా’’ అంటూ జోకులు పేల్చారు. యుద్ధం జరుగుతున్న వేళ శత్రువు చేసే అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన చెప్పారు.

అయితే, అది కూడా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన వీడియోనేనని ఎలాన్ మస్క్ కు చెందిన ‘గ్రోక్ ఏఐ’ పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా నెతన్యాహు ఓ హిల్ స్టేషన్ కు వెళ్లి అక్కడున్న సందర్శకులను కలిసి మాట్లాడారు. ‘మనందరం కలిసికట్టుగా ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో గెలుస్తున్నాం’ అంటూ నెతన్యాహు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియోపై కూడా పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News