రంజాన్ మాసంలో మారణహోమం.. పాక్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని నింపాయి. కాబూల్‌లోని ఓ పునరావాస కేంద్రంపై జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య 400కి చేరినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది స్పష్టంగా వార్ క్రైమ్ అని మండిపడ్డాడు.

ఈ ఘటనపై రషీద్ ఖాన్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. "కాబూల్‌లో పాకిస్థాన్ వైమానిక దాడుల వల్ల అమాయక పౌరులు మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. పౌరుల ఇళ్లు, విద్యా సంస్థలు, వైద్యశాలలను లక్ష్యంగా చేసుకోవడం, అది ఉద్దేశపూర్వకంగా అయినా లేదా పొరపాటున జరిగినా యుద్ధ నేరమే అవుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో మానవ ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేకుండా ప్రవర్తించడం వికారం పుట్టిస్తోంది" అని పేర్కొన్నాడు.

ఈ చర్య కేవలం విద్వేషాన్ని, విభజనను మాత్రమే పెంచుతుందని రషీద్ తెలిపాడు. "ఈ దారుణంపై ఐక్యరాజ్యసమితి, ఇతర మానవ హక్కుల సంస్థలు సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను శిక్షించాలని నేను కోరుతున్నాను. ఈ కష్టకాలంలో నేను నా ఆఫ్ఘన్ ప్రజలతోనే ఉంటాను. మనం కోలుకుంటాం, ఒక దేశంగా మళ్లీ నిలబడతాం" అని తన పోస్టులో రాసుకొచ్చాడు.

నబీ తీవ్ర ఆవేదన
ఈ దాడిపై ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కూడా తీవ్రంగా స్పందించాడు. "ఈ రాత్రి కాబూల్‌లోని ఆసుపత్రిలో ఆశలు ఆవిరైపోయాయి. చికిత్స కోసం వచ్చిన యువకులను పాకిస్థాన్ సైనిక పాలన బాంబులతో హత్య చేసింది. తల్లులు గేట్ల వద్ద తమ కుమారుల పేర్లను పిలుస్తూ ఎదురుచూశారు. రంజాన్ 28వ రాత్రి వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి" అంటూ నబీ ఆవేదనతో కూడిన పోస్ట్ చేశాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం ఈ దాడి మాదకద్రవ్యాల బాధితులకు చికిత్స అందించే పునరావాస ఆసుపత్రిపై జరిగింది. 


More Telugu News