ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి (సోమవారం, మార్చి 16) నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. 

పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తాయి. మొత్తం విద్యార్థుల్లో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 

మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. వీటితో పాటు 210 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా హాల్‌లోకి ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, క్యాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని విద్యాశాఖ పేర్కొంది.
 


More Telugu News