విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి, 80 సీట్లు.. బీజేపీ ఆఫర్‌పై జోరుగా ప్రచారం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా టీవీకేకు 80 అసెంబ్లీ స్థానాలు, విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టు ఆ కథనాల సారాంశం. అయితే, ఈ వార్తలను బీజేపీ, దాని మిత్రపక్షమైన అన్నాడీఎంకే, అలాగే విజయ్ పార్టీ టీవీకే తీవ్రంగా ఖండించాయి.

ఈ పొత్తుల ప్రచారంపై టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ స్పందిస్తూ.. "ఎన్డీయేతో పొత్తుకు ఆస్కారమే లేదు. సిద్ధాంతపరంగా బీజేపీ మాకు శత్రువు అని మేము ఇప్పటికే స్పష్టం చేశాం" అని తెలిపారు. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. "ఇప్పటివరకు వారితో ఎలాంటి చర్చలూ జరపలేదు. అలాంటప్పుడు పొత్తు ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా మీడియా సృష్టిస్తున్న అనవసర ప్రచారం" అని ఆయన అన్నారు.

మరోవైపు, బీజేపీ నేత కె.అన్నామలై గతంలో "టీ, కాఫీ ఎప్పటికీ కలవలేవు. రెండు పార్టీల సిద్ధాంతాలు వేరు" అని వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. "తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికలు సమీపించే కొద్దీ అనూహ్యమైన మలుపులు ఉంటాయి. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం" అని ఆయన అనడంతో పొత్తుల ఊహాగానాలకు మళ్లీ బలం చేకూరింది. అధికారికంగా మూడు పార్టీలు ఖండిస్తున్నప్పటికీ, వర్గాల సమాచారం ఆధారంగా వస్తున్న కథనాలతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి.


More Telugu News