మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది... ట్రైలర్ అదిరింది: ఉస్తాద్ ట్రైలర్ పై చిరంజీవి మెగా ప్రశంసలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలై యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 14 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో, ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించగా, దర్శకుడు హరీశ్ శంకర్ కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ ట్రైలర్‌పై సోషల్ మీడియా వేదికగా చిరంజీవి స్పందించారు. "మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే!!" అని తనదైన శైలిలో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్, చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి ట్వీట్‌కు దర్శకుడు హరీశ్ శంకర్ ఉద్వేగభరితంగా బదులిచ్చారు. విదేశాల్లో ఉన్నప్పటికీ సమయం తీసుకుని ట్రైలర్ చూసినందుకు ధన్యవాదాలు తెలిపారు. "అయ్యబాబోయ్... అన్నయ్య !! మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఏ రేంజులో నచ్చిందో నాకర్థమైంది. ‘మెగా ఆశీర్వాదం’ కూడా దొరికింది కాబట్టి ఇక మెరుపు వేగంతో దూసుకెళ్లడమే. ఎందుకంటే.. మీరు ట్వీటు పెడితే...హీటు పెరిగినట్టే!!" అని హరీశ్ శంకర్ తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనకు చిరంజీవి ప్రశంసలు తోడవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టయినర్ మూవీలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. 


More Telugu News