2011 నాటి ఫొటోతో గ్యాస్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది: కిరణ్ రిజిజు

ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ఇంధన కొరతపై కాంగ్రెస్ పార్టీ అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా విమర్శించారు. పాత ఫోటోలను అడ్డుపెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తోందని శనివారం ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో ఓ పోస్ట్ చేశారు.

2011లో ఎల్పీజీ సిలిండర్ల కోసం ప్రజలు క్యూలో నిల్చున్న ఫోటోను కాంగ్రెస్ ఇప్పుడు వాడుకుంటోందని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. "ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ పార్టీ తనను తాను అవమానించుకోవద్దు" అని ఆయన హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని, ఇంధన సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని రిజిజు భరోసా ఇచ్చారు.

మరోవైపు, బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ అమిత్ మాలవీయ కూడా ఈ విషయంపై స్పందించారు. ఇరాన్ సంక్షోభం తర్వాత జీ20 దేశాల్లో పెట్రోల్ ధరల పెరుగుదలను వివరిస్తూ ఓ జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా ప్రకారం, అమెరికాలో 22 శాతం ధర పెరగగా, భారత్‌లో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఇండోనేషియాలో కూడా ధరలు పెరగలేదని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలకు సరిపడా నిల్వలు ఉన్నాయని విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ పిలుపునిచ్చిందని, సముద్ర వాణిజ్య కార్యకలాపాలకు భద్రత కల్పించి, ప్రభావిత ప్రాంతంలోని భారతీయ నావికులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


More Telugu News