మాట నిలబెట్టుకున్న ఇరాన్.. హర్మూజ్‌ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్‌కు భారీ ఊరట లభించింది. కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని ఇరాన్ ఇచ్చిన హామీ మేరకు రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు ఆ జలసంధిని విజయవంతంగా దాటాయి. 'శివాలిక్', 'నందా దేవి' అనే ఈ రెండు నౌకలు ప్రస్తుతం సురక్షిత జలాల్లోకి ప్రవేశించాయి.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 'శివాలిక్' నౌక ప్రస్తుతం భారత నౌకాదళం పర్యవేక్షణలో ఉంది. మరో రెండు రోజుల్లో ఇది ముంబై లేదా కాండ్లా ఓడరేవుకు చేరుకునే అవకాశం ఉంది. ఇక రెండో నౌక అయిన 'నందా దేవి' కూడా జలసంధిని దాటింది. ఈ నౌకలో దేశ ఇంధన సరఫరా వ్యవస్థకు అత్యంత కీలకమైన 46,000 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉంది. ఈ రెండు నౌకల ప్రయాణాన్ని మన నౌకాదళం నిశితంగా పర్యవేక్షిస్తూ, వాటి భద్రతను చూస్తోంది.

ఈ సానుకూల పరిణామం వెనుక ఉన్నతస్థాయి దౌత్యపరమైన చర్చలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య వస్తువులు, ఇంధన రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా చర్చించారు. ఈ చర్చల ఫలితంగానే ఇరాన్ భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించింది.

భారత్ తమకు మిత్రదేశమని, ఇరు దేశాలకు ఈ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ స్పష్టం చేశారు. "యుద్ధం తర్వాత కూడా భారత ప్రభుత్వం మాకు అనేక విధాలుగా సహాయం చేసింది. భారత్ మా మిత్రదేశం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే భారత నౌకలకు మార్గం సుగమం కావడం గమనార్హం.

ప్రపంచంలోని మొత్తం చమురు, గ్యాస్ ఎగుమతుల్లో 20 శాతం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 28 భారత నౌకలు, 778 మంది భారత సిబ్బంది ఉన్నారని, వారి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా పరిణామంతో పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్ తన ఇంధన భద్రత విషయంలో ఒక కీలక ముందడుగు వేసినట్లయింది.


More Telugu News