Mithun Reddy: మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం

Key development in Mithun Reddy bail issue

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. ఏసీబీ కోర్టు తన పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.


ఈ కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మిథున్ రెడ్డి విషయంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాలేదని హైకోర్టు గుర్తు చేసింది. అయినప్పటికీ, ఏసీబీ కోర్టు తన బెయిల్ ఉత్తర్వుల్లో దర్యాప్తు ముగిసినట్లు పేర్కొనడం, గూగుల్ టేక్ అవుట్ వంటి సాంకేతిక ఆధారాలను, సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోలేమని వ్యాఖ్యానించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధమైన వ్యాఖ్యలు కేసు దర్యాప్తును నీరుగార్చేలా ఉన్నాయని, వీటిని ఆధారంగా చేసుకుని ఇతర నిందితులు కూడా బెయిల్ కోరే ప్రమాదం ఉందని సీఐడీ తరఫు న్యాయవాదులు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వినిపించిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.


అయితే, మిథున్ రెడ్డికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయడానికి మాత్రం హైకోర్టు నిరాకరించింది. కేవలం బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు ప్రస్తావించిన వివాదాస్పద అంశాలను మాత్రమే నిలిపివేస్తూ తుది తీర్పునిచ్చింది.

Mithun Reddy
YSRCP
AP High Court
Andhra Pradesh
CID
ACB Court

More Telugu News