మెస్సీ విజయాల వెనుక నిలిచిన మహిళ.. ఆంటొనెల్లా కథ ఇదే!
- చిన్నప్పుడే పరిచయమైన ఆంటోనెల్లా రొక్కుజో
- ఇద్దరిదీ అర్జెంటీనాలోని రొసారియో నగరం
- ఫుట్బాల్ కోసం స్పెయిన్ వెళ్లిన మెస్సీ
- అయినా కొనసాగిన బంధం
- 2017లో వివాహం
- ఇరువురికీ ముగ్గురు పిల్లలు
మెస్సీ, ఆంటొనెల్లా ఇద్దరూ అర్జెంటీనాలోని రొసారియో నగరానికి చెందినవారు. ఆంటొనెల్లా బంధువు మెస్సీకి సన్నిహిత స్నేహితుడు. ఆ పరిచయంతోనే చిన్నతనంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత ఫుట్బాల్లో రాణించాలనే లక్ష్యంతో స్పెయిన్కు వెళ్లిపోయాడు మెస్సీ. లా మాసియా అకాడమీలో చేరి తన కెరీర్ను ప్రారంభించాడు. ఇద్దరూ వేర్వేరు దేశాల్లో ఉన్నా పరిచయం కొనసాగింది. కాలక్రమంలో అది ప్రేమగా మారింది.
మెస్సీ ప్రపంచ ఫుట్బాల్లో స్టార్గా ఎదుగుతున్న రోజుల్లో కూడా వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగానే ఉంచారు. మీడియాలో పెద్దగా కనిపించడానికి ఆసక్తి చూపలేదు. అయితే అభిమానుల్లో మాత్రం వారి గురించి ఎప్పుడూ ఆసక్తి ఉండేది. ఎన్నో ఏళ్ల ప్రేమ తర్వాత 2017లో రొసారియోలో వివాహం చేసుకున్నారు. ప్రపంచ ఫుట్బాల్కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అప్పట్లో అర్జెంటీనా మీడియా దీన్ని ‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’గా అభివర్ణించింది.
వీరిద్దరికీ థియాగో, మాటియో, సిరో అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు థియాగో ఇప్పటికే ఫుట్బాల్ వైపు అడుగులు వేస్తున్నాడు. మాటియో తన చలాకీతనంతో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. చిన్న కుమారుడు సిరో ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలోని మయామిలో ఉంటున్నాడు.
ఆంటొనెల్లా కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించారు. కుటుంబానికి సంబంధించిన ఫొటోలు, పిల్లలతో గడిపే క్షణాలు, మెస్సీ విజయాల సందర్భంగా పంచుకునే పోస్టులు ఆమెకు ప్రత్యేక అభిమాన వర్గాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమెను కోట్లాది మంది అనుసరిస్తున్నారు.
ఫుట్బాల్ కెరీర్లో మెస్సీ ఎన్నో క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు. అనేక దేశాల్లో నివసించాడు. కానీ చిన్ననాటి పరిచయంతో మొదలైన ఆంటొనెల్లాతో బంధం మాత్రం ఎప్పుడూ మారలేదు. అందుకే ప్రపంచ క్రీడా రంగంలో అత్యంత ఆదరణ పొందిన జంటల్లో వీరిద్దరూ ఒకరిగా నిలిచారు.