విజయ్ దేవరకొండ, వెంకటేష్లకు లీగల్ నోటీసులు.. ‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు!
- టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ, క్రీడా ప్రముఖులు
- బీసీసీఐ నుంచి టీజీ20 లీగ్కు అనుమతులు లేవన్న హెచ్సీఏ
- లీగ్ ప్రమోషన్లపై సదరు ప్రముఖులు ఆలోచన చేయాలన్న టీసీఏ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 లీగ్’ చుట్టూ ఇప్పుడు ఊహించని లీగల్ ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ లీగ్ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలతో పాటు పలువురు స్టార్ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ సినీ సర్కిల్స్లో సంచలనంగా మారింది.
బీసీసీఐ అనుమతి లేదు - టీసీఏ సంచలన ఆరోపణలు:
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే హెచ్సీఏ ఈ టీజీ20 లీగ్ను అక్రమంగా నిర్వహిస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. బోర్డు పర్మీషన్ లేని లీగ్ను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం చట్టప్రకారం తప్పని వేలెత్తి చూపింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ లీగ్ పేరు వాడుకుంటూ కార్పొరేట్ కంపెనీలతో హెచ్సీఏ రూ. వందల కోట్ల బిజినెస్ చేస్తోందని టీసీఏ మండిపడింది. ఇది కేవలం యువ క్రికెటర్లను, స్పాన్సర్లను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించింది.
ఈ అక్రమ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారంటూ టీసీఏ కింది ప్రముఖులకు అధికారికంగా లీగల్ నోటీసులు పంపింది:
సినీ ప్రముఖులు: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్.
క్రికెట్ స్టార్స్: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, యువ సెన్సేషన్ తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేస్తూ సాగుతున్న ఈ లీగ్ ప్రమోషన్లపై సదరు ప్రముఖులు వెంటనే పునరాలోచన చేయాలని.. లేనిపక్షంలో చట్టపరంగా కఠినమైన న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో టీసీఏ గట్టిగా హెచ్చరించింది.