హర్మూజ్ జలసంధిలో టెన్షన్.. క్షిపణుల మధ్య చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

  • ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌక
  • ముంబై కెప్టెన్‌ సహా 34 మంది సిబ్బంది భయానక పరిస్థితుల్లో నిరీక్షణ
  • కళ్లముందే క్షిపణులు, డ్రోన్లు ఎగురుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన కెప్టెన్ 
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.

అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. "మేము రోజూ ఆకాశంలో క్షిపణులు, డ్రోన్లు ఎగరడం చూస్తున్నాం. నిరంతరం సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, భారత నౌకాదళం తమకు రక్షణగా వచ్చి సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ముంబైలోని కెప్టెన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. "నా భర్త, సిబ్బంది క్షేమంగా తిరిగి రావాలని రోజూ ప్రార్థిస్తున్నాను. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక వాట్సాప్ కాల్స్ మధ్యలోనే కట్ అవుతుంటే ప్రాణం పోయినంత పనవుతోంది" అని ఆయన భార్య నిల్పా విశ్వకర్మ కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదిలా ఉండగా, భారత్‌తో ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా ఇరాన్ భారత నౌకలకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లను హర్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతించినట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో కెప్టెన్ వీరేంద్ర ప్రయాణిస్తున్న నౌకకు కూడా భారత నౌకాదళ రక్షణతో త్వరలోనే సురక్షిత మార్గం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Virendra Vishwakarma
Hormuz Strait
Indian sailors
Iran
USA
UAE
LPG tanker
Missiles
Tensions
Indian Navy

More Telugu News