Rajendra Prasad: అది ఆయన గొప్పతనం.. క్షమాపణ చెప్పిన రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ప్రశంసలు

Vishal Appreciates Rajendra Prasads Apology Regarding MGR Comments
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం పట్ల తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల వివాదం ఆయన క్షమాపణతో ముగిసిన నేపథ్యంలో విశాల్ స్పందించారు. ఇది రాజేంద్రప్రసాద్ గారి నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని అభినందించారు.

ఎంజీఆర్‌ను అభిమానించే ఎంతోమంది ఆయన వ్యాఖ్యలతో బాధపడ్డారని, ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) వివరణ కూడా కోరిందని విశాల్ గుర్తుచేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడాన్ని తాను మెచ్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025' కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయన నటన చూసి ఎంజీఆర్ భయపడేవారని, వణికిపోయేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నటులు విశాల్, నాజర్‌తో పాటు పలువురు తీవ్రంగా స్పందించారు.

వివాదం పెద్దది కావడంతో రాజేంద్రప్రసాద్ తమిళంలో ఒక వీడియో విడుదల చేసి క్షమాపణ చెప్పారు. "నేను కూడా ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తాను. కాంతారావు గారిని పొగిడే క్రమంలో నోరుజారాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇలాంటివి జరగవు" అని ఆయన వివరణ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ తన పొరపాటును అంగీకరించి క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.
Rajendra Prasad
Vishal
MGR
Nadigar Sangam
South India Artist Association
Kanta Rao
Tamil Nadu
Apology
Controversy
Actor

More Telugu News