స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి!

భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నాడు భారీ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా సూచీలు కుప్పకూలడంతో, ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్కరోజే ఏకంగా రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఈ భారీ పతనంతో బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.429 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ వారంలో మొత్తం నష్టం రూ.20 లక్షల కోట్లకు చేరినట్లు అంచనా.

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు మార్కెట్లను తీవ్రంగా భయపెట్టాయి. హార్ముజ్ జలసంధి మూసివేత పరిణామాలతో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100.61 డాలర్లకు చేరింది. చమురు ధరల పెరుగుదల దిగుమతుల బిల్లును పెంచుతుందనే ఆందోళనతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి 92.45కు పడిపోయింది.

దీనికి తోడు, అమెరికాలో బాండ్ యీల్డ్స్ పెరగడంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. గత 10 రోజులుగా అమ్మకాలు కొనసాగిస్తున్న ఎఫ్‌ఐఐలు, ఒక్క గురువారమే రూ.7,050 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మొత్తం 10 సెషన్లలో రూ.57 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ పరిస్థితులు కొనసాగితే మార్కెట్లు మరింత పతనం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తూ, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


More Telugu News