ఆడి బాటలోనే మెర్సిడెస్ బెంజ్... భారత్ లో పెరగనున్న కార్ల ధరలు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్లపై సుమారు 2 శాతం మేర ధరలు పెరగనున్నట్టు తెలిపింది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, విదేశీ మారకద్రవ్యంలో అస్థిరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ విషయంపై కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ సిసింగ్ మాట్లాడుతూ.. "ముఖ్యంగా యూరోతో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వ్యాపార సుస్థిరత కోసం ఈ ధరల సవరణ తప్పనిసరి అయింది. ఏప్రిల్ 1 నుంచి మా పోర్ట్‌ఫోలియో అంతటా సుమారు 2 శాతం ధరల పెంపును అమలు చేస్తున్నాం" అని తెలిపారు. అయితే, ఈ పెంపు ప్రభావం వినియోగదారులపై వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామని, అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలు అందించడంపై తమ దృష్టి కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, మరో జర్మన్ లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇండియా ఇప్పటికే ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. తమ కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి 2 శాతం వరకు పెంచుతున్నట్లు ఈ వారంలోనే ప్రకటించింది. ముడిసరుకుల ధరలు, కరెన్సీ రేట్లలో మార్పులే ఇందుకు కారణమని ఆడి కూడా స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ నుంచి రెండు ప్రధాన జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్ల ధరలు పెరగనున్నాయి.


More Telugu News